మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (10:08 IST)

కులం తక్కువ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావో అంతే : మోసపోయిన యువతి!

ప్రేమించేటపుడు.. పెళ్లి చేసుకునే సమయంలో యువకుని కుటుంబసభ్యులకు కనిపించని, అడ్డురాని కులం.. ఐదు నెలలు కాపురం చేసిన తర్వాత అడ్డొచ్చాయి. అందుకే కులం తక్కువ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే అంతే సంగతులు అంటూ యువకుని కుటుంబసభ్యులు బెదిరించారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకుని సంసారం చేసిన పాపానికి ఓ యువతి నడి రోడ్డుపై అనాథగా నిలబడింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటికి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన హైదరాబాద్, హయత్ నగర్ మండలంలో చోటుచేసుకుంది. 
 
ఆదివారం వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే.. హయత్‌నగర్‌ మండలం బండరావిరాల గ్రామానికి చెందిన కందికట్ల రమేష్‌, రత్నమ్మ కుమార్తె గీత. అదే గ్రామానికి చెందిన పల్లపు రాములు, అండాలు కుమారుడు సురేష్‌‌. వీరిద్దరు కొన్నేళ్లపాటు ప్రేమాయణం సాగించి గత జనవరి 12వ తేదీన సికింద్రాబాద్‌ ఆర్యసమాజ్‌లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి గీత, సురేష్‌ ఉప్పల్‌లో కాపురం పెట్టారు. 
 
అయితే, గత కొన్ని రోజులుగా సురేష్‌కు పనిలేక ఆర్థిక ఇబ్బందులుతలెత్తాయి. నెలరోజుల తర్వాత తీసుకెళతానని భార్యను పుట్టింటికి పంపించివేశాడు. అతడు మాటలు నమ్మిన గీత నెలరోజులుగా అమ్మగారింట్లోనే ఉంటోంది. ఈ పరిస్థితుల్లో భర్తతో మాట్లాడేందుకు అనేకమార్లు ఆమె ఫోన్ చేసినా స్పందించడం లేదు. 
 
దీంతో అనుమానం వచ్చిన గీత సురేష్‌ ఇంటికి ఆదివారం వెళ్లింది. అతడి కుటుంబసభ్యులు ఇంటికి తాళంవేసి వెళ్లిపోయారు. న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. అన్యాయం చేశాడని ఆరోపిస్తోంది. కులం తక్కువ అమ్మాయిని ఇంటికి తీసుకురావద్దని అతడి కుటుంబసభ్యులు అడ్డుపడుతున్నారని గీత తెలిపింది.