వివాహేతర బంధానికి అడ్డున్నాడని భర్త కళ్ళలో జిల్లేడు పాలు కొట్టిన భార్య!
పరాయి పురుషునితో తాను నెరుపుతున్న వివాహేతర సంబంధానికి అడ్డున్నాడని భావించిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్త కళ్లలోనే జిల్లేడు పాలు పోసింది. దీంతో అతని కళ్లు పోయాయి. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు ఆ మహిళతో పాటు.. ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. హైదరాబాద్, ఎల్బీ నగర్లో చోటు చేసుకున్న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
ఎల్బీనగర్ మెడికేర్ ఆసుపత్రి సమీపంలోని పరిమళ అపార్ట్మెంట్లో నివాసముండే కొత్తకొండ రాఘవేందర్ (40), సరిత (32) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రాఘవేందర్ వివాహాలకు పూల అలంకరణ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన స్టీల్ వ్యాపారి గోపాల్ రెడ్డి (37) ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి కూడా రాఘవేందర్ డెకరేషన్ చేశాడు.
ఒకసారి నగరానికి వచ్చిన గోపాల్ రెడ్డి ఓసారి ఎల్బీనగర్లోని రాఘవేందర్ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో ల్యాండ్లైన్తో పాటు రాఘవేందర్ భార్య సరిత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ లోబర్చుకున్నాడు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్న రాఘవేందర్ను హత్య చేయాలని సరిత తన ప్రియుడు గోపాల్రెడ్డితో కలిసి పథకం వేసింది.
ఈ క్రమంలో రాఘవేందర్ ఇంట్లో పడుకొని ఉండగా... ఇద్దరూ కలిసి కంట్లో జిల్లేడు పాలు పోశారు. కళ్లు ఎంతకూ తెరుచుకోకపోవడంతో సమీపంలోని ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అదేసమయంలో సరిత కొడుకును హయత్నగర్లోని ప్రైవేట్ హాస్టల్లో చేర్పించి కూతురిని తీసుకుని గోపాల్రెడ్డి వద్దకు వెళ్లిపోయింది. కళ్లు కోల్పో
యిన రాఘవేందర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈనెల 13న ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
అలాగే, గోపాల్రెడ్డి తనకు డెకరేషన్ పని నిమిత్తం రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ.లక్ష మాత్రమే చెల్లించాడని, మిగతాది ఎగ్గొట్టాడని రాఘవేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాఘవేందర్ను హత్య చేయడానికి ప్రయత్నించిన భార్య సరిత, గోపాల్రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.