శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:14 IST)

మూడుముళ్లు పడిన రోజే హేమంత్‌‌ను చంపే వరకు అన్నం ముట్టనని అవంతి తల్లి శపథం!

తాము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె అవంతిని తీసుకెళ్లి హేమంత్ అనే కుర్రోడు పెళ్లి చేసుకోవడాన్ని వధువు తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. ముఖ్యంగా, వధువు తల్లి అర్చన్ ఏమాత్రం తట్టుకోలేక పోయింది. కుమార్తె మెడలో హేమంత్ మూడు ముళ్లు వేసిన రోజునే హేమంత్‌ను చంపేంత వరకు అన్నం ముట్టనని అర్చన్ శపథం చేసిందట. ఈ విషయాన్ని అవంతి తాజాగా వెల్లడించింది. పైగా, హేమంత్‌తో తన్ ప్రేమ విషయం తెలిసినపుడే తనకు అన్నంలో విషం పెట్టి చంపుతానని బెదిరించిందని అవంతి వెల్లడించింది. 
 
హైదరాబాద్, చందానగర్‌లో ఇటీవల పరువు హత్య జరిగిన విషయం తెల్సిందే. ఈ కేసులో భర్తను కోల్పోయిన అవంతి పలు విషయాలను వెల్లడించింది. హేమంత్‌తో తన ప్రేమ విషయం తెలిసినప్పుడే అన్నంలో విషం పెట్టి చంపేస్తానని తనను తల్లి అర్చన హెచ్చరించిందని అవంతి చెప్పారు. తాను ఇంట్లోంచి బయటకు వెళ్లి హేమంత్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అతడిని చంపాలని నిర్ణయించుకుందని ఆరోపించారు. 
 
హేమంత్‌ను చంపేంత వరకు అన్నం తినను అని ఒట్టు వేసుకుందని, ఆమెకు తండ్రి లక్ష్మారెడ్డి మద్దతు ఇస్తే.. యుగేంధర్‌రెడ్డి రెచ్చగొట్టాడని ఆమె చెప్పారు. హేమంత్‌ను హత్యచేసిన చోటే తన తల్లిదండ్రులను మేనమామ యుగేంధర్‌ రెడ్డిలను ఎన్‌కౌంటర్‌ చేయాలని  డిమాండ్‌ చేశారు. పెళ్లయిన మూడు నెలలకే తనను వింతంతువును చేశారని, వారెవ్వరికీ బతికే అర్హత లేదని.. తనకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ న్యాయం చేయాలని కోరారు.
 
హేమంత్‌ను చంపిన ఘటనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శిక్షపడాలని కోరారు. హత్య ఘటనలో భాగంకాకుండా అన్యయ్య ఆశిష్‌ రెడ్డి ఉద్దేశపూర్వకంగా బయట ఉన్నాడని, అతడితో తనకు తన అత్తగారి కుటుంబానికి ప్రాణహాని ఉందని అవంతి ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను బెయిల్‌ మీద బయటకు తెచ్చేందుకు ఆశిష్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని, ముందు అతడిని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు.