శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (09:19 IST)

సీపీ సజ్జనార్ ఆదేశాలను ఖాతరు చేయని పోలీసులు... అందుకే హేమంత్ హత్య!!?

కులాంతర వివాహం చేసుకున్న హేమంత్, అవంతిలకు రక్షణ కల్పించాలని సీపీ సజ్జనార్ చందానగర్ పోలీసులను ఆదేశించారు. కానీ, వారు కొత్త దంపతులకు భద్రత కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా హేమంత్‌ను కులోన్మాదం హత్య చేసింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్యోదంతానికి కులోన్మాదమే కారణమని సైబరాబాద్‌ పోలీసులు తేల్చారు. ఈ మేరకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగేంధర్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
 
అయితే, హేమంత్‌ - అవంతి వ్యవహారంలో చందానగర్‌ పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. కొత్త దంపతులు రక్షణ కోరుతూ తనను కలిశాక సీపీ సజ్జనార్‌ చందానగర్‌ పోలీసులకు ఫోన్‌చేసి భద్రత కల్పించాలని ఆదేశించారు. అవంతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. కానీ, ఈ  వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 
 
పెళ్లయిన వారం రోజులకు అవంతి, హేమంత్‌లను కౌన్సెలింగ్‌ కోసమని పిలిచిన పోలీసులు.. అక్కడ అవంతి తల్లిదండ్రులకే వత్తాసు పలికారు. లక్ష్మారెడ్డి, అర్చన, యుగేంధర్‌రెడ్డిలు పోలీసుల ముందే హేమంత్‌, అతడి తల్లిదండ్రులను దుర్భాషలాడుతున్నా వారించలేదు. 'మీరు ఎలా బతుకుతారో చూస్తాం' అంటూ హెచ్చరించడంతో.. తమకు ప్రాణహాని ఉందంటూ హేమంత్‌ కుటుంబం అదే రోజు ఫిర్యాదు చేయగా.. దానిపట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.