శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (14:04 IST)

హైదరాబాద్ మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పు.. రూ.400 కోట్లు కేటాయింపు!

హైదరాబాద్ మెట్రో రైల్ అలైన్మెంట్ మారనుంది. ఈ మార్పు వల్ల పెరిగే ప్రాజెక్టు వ్యయాన్ని భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రూ.400 కోట్లను కేటాయించారు. నిజానికి మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పుపై కేసీఆర్ చాలా పట్టుదలగా ఉండటంతో స్వల్పమార్పులతో పట్టాలెక్కేందుకు మార్పులు చేర్పులు చేస్తున్నారు. మెట్రో అలైన్మెంట్ మార్పు వల్ల... 'ఎల్ అండ్ టి'కి కలిగే నష్టాన్ని మరియు కొత్త అలైన్మెంట్‌కు అయ్యే అదనపు ఖర్చు కోసం ఈ మొత్తాన్ని కేటాయించారు. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా చారిత్రక కట్టడాలకు ఏమాత్రం భంగం కలగకుండా... వాటికి కాస్త దూరం నుంచి వెళ్లేలా... అధికారులు కొత్త రూట్ మ్యాప్‌ను సైతం సిద్ధం చేశారు. మెట్రో రైల్ కోసం చారిత్రక కట్టడాలను కూల్చడంగాని... వాటికి నష్టం చేయడాన్నిగాని కేసీఆర్ ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
కేసీఆర్ సలహా ప్రకారమే రవీంద్రభారతి... అసెంబ్లీల మీదుగా వెళ్లాల్సిన మెట్రో రూటును నాంపల్లిలో మొదలుకుని... తెలుగు యూనివర్శిటీ వెనుక భాగం నుంచి పబ్లిక్ గార్డెన్స్ మీదుగా లక్డీకాపూల్ చేరుకునేలా ఆలైన్మెంట్ మార్చనున్నారు. అలాగే, సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లాల్సిన రూట్‌ను కోటి ఉమెన్స్ కాలేజ్ వెనుక నుంచి తీసుకువచ్చి... బాటా జంక్షన్ ఎడమ వైపుగా కాచిగూడాకు తీసుకురానున్నారు.
 
ఇప్పటికే లక్డీకాపూల్, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో మెట్రో తన పనులను నిలిపివేసింది. రీ అలైన్మెంట్ కారణంగా లక్డీకాపూల్, గన్ పార్క్, అసెంబ్లీ, రూట్లలో వేసిన సుమారు 21 పిల్లర్లను తొలగించాల్సి వస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ హైదరాబాద్ మెట్రో రైల్ అధారిటీ అధికారులతో చర్చించారు.