శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (11:05 IST)

ఆంటీ.. నేనో ఆడపిల్లను.. ఆ ఫోటోలు అజయ్ సెల్‌లోనే ఉన్నాయ్.. టెక్కీ శ్వేత

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత ఆత్మహత్య కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు శ్వేత తన ప్రియుడు అజయ్ తల్లితో సోదరితో ఫోనులో మాట్లాడింది. తన మనసులోని బాధను వారికి చెప్పుకుని బోరుమని ఏడ్చింది. 
 
ఆంటీ... తానో ఆడ పిల్లనని, ఆ ఫొటోలు అజయ్ దగ్గర తప్ప మరెవరి వద్దా లేవని శ్వేత వేడుకుంటుంటే, తన కుమారుడు అటువంటి వాడు కాదని, ఆ చిత్రాలు మరెవరి నుంచో బయటకు వచ్చుంటాయని అజయ్ తల్లి చెబుతున్నట్టుగా ఉన్న ఓ ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 
 
తన బిడ్డ చాలా మంచివాడని, అలాంటి ఫొటోలను బయటకు తెచ్చి పరువు తీసే రకం కాదని అజయ్ తల్లి చెబుతుంటే, ఆ ఫొటోలు అజయ్ సెల్ ఫోనులో తప్ప ఇంకెక్కడా లేవని శ్వేత వాపోయింది. 
 
కాగా, గత నెల 18వ తేదీన ఇంటి నుంచి మాయమైన శ్వేత, ఆ తర్వాత రోజు బీబీనగర్ సమీపంలోని ఎన్ఎఫ్‌సీ నగర్ వద్ద రైలు పట్టాలపై మృతదేహంగా కనిపించిన విషయం తెలిసిందే. తాజా ఆడియో బహిర్గతం కావడంతో కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లు అయింది. 
 
తన వ్యక్తిగత చిత్రాలు అజయ్ సెల్ ఫోన్లో ఉన్నాయని శ్వేత చెబుతుండగా, దానితో తనకు సంబంధం లేదని, ఇటీవలే తాము పొట్టకూటి కోసం వచ్చామని అజయ్ తల్లి సర్ది చెబుతోంది. ఏదైనా ఉంటే తను వచ్చినప్పుడు చెప్పాలని కోరింది. 
 
ఇదిలావుంటే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న అజయ్‌ని పోలీసులు ప్రశ్నించగా, శ్వేతతో కలిసి ఉన్న వ్యక్తిగత చిత్రాలను తానే స్వయంగా సోషల్ మీడియాలో అప్‌‌లోడ్ చేసినట్టు అంగీకరించినట్టు సమాచారం. తాను చిత్రాలను పెట్టిన తర్వాత తనపై కేసు పెట్టారని, అందుకే ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించానని అజయ్ వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.