ఎస్. జైపాల్ రెడ్డి సెటైర్లు.. అద్వానీ మమ్మీ.. సుష్మా డమ్మీ.. ఇది మోడీ రూల్
ప్రధానమంత్రి నేరంద్ర మోడీ ప్రభుత్వ యేడాది పాలనపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆయన బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని మమ్మీని, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ను డమ్మీని చేసి పక్కన పెట్టేశారని అన్నారు.
ఇకపోతే.. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లను మించినవారు లేరన్నారు. ఉద్యమం సమయంలో 'అవకాశాలన్నీ అమరవీరులు, ఉద్యమకారులకే' అని చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత వారిని పక్కన పెట్టేశారని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ఒకరిని మించి మరొకరు హామీలు ఇచ్చారని, అందులో ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రజలను మోసం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో వీరిద్దరూ 'ఒకరిని మించినవారు మరొకర'ని ఆయన చెప్పారు. కాశ్మీర్ టెర్రరిస్టు మద్దతుదారులతో జతకట్టి దేశ భక్తిని ప్రధాని నిరూపించుకుంటే, తీవ్రవాద చర్యలకు మద్దతిచ్చే ఎంఐఎంతో కేసీఆర్ అంటకాగుతున్నారని ఆయన విమర్శించారు.