శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (05:27 IST)

చింతచచ్చినా పులుపు చావని రకం అంటే వీళ్లే మరి.. జానా సీఎం అట!

తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నది ఇద్దరు ముగ్గురు కాదని కనీసం పన్నెండుమందికి ఆ ఆశ ఇంకా ఉంటూనే ఉందని జైపాల్ రెడ్డి ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకిపడేశారు కానీ టి-కాంగ్రెస్‌ నేతల్లో మాత్రం ఇప్పటికీ జ్ఞానోదయం కలగటం లేదు.

నిన్న కాక మొన్ననే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవీ వ్యామోహాన్ని గేలి చేస్తూ సుతిమెత్తగా కడిగిపారేశారు. అందరూ అనుకుంటున్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నది ఇద్దరు ముగ్గురు కాదని కనీసం పన్నెండుమందికి ఆ ఆశ ఇంకా ఉంటూనే ఉందని జైపాల్ రెడ్డి ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకిపడేశారు కానీ టి-కాంగ్రెస్‌ నేతల్లో మాత్రం ఇప్పటికీ జ్ఞానోదయం కలగటం లేదు. 
 
తెలంగాణ విషయంలో, విభజన అంశంలో చేసిన నిర్వాకానికి కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం దక్కింది. ఆంద్రప్రదేశ్‌లో ఆ పార్టీ అడుగంటిపోయింది. ఏపీ ప్రజలు దాన్ని తిరిగి లేవకుండా కుళ్లబొడిచేశారు. ఇక తెలంగాణలో అంటారా.. రాష్ట్రం ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే. రేపు ఏలబోతోందీ మేమే అంటూ విర్రవీగిన టి.కాంగ్రెస్ మాడు పగిలేలా తెలంగామ ప్రజలు తిప్పి కొట్టారు. గెలిచిన ఆ కొద్ది మంది ఎమ్మెల్ల్యేల్లో సగంమందిని కేసీఆర్ ఆకర్షక్ ద్వారా లాగేసుకున్నాడు. 
 
కళ్లముందు ఇంత పతనాన్ని చవిచూసిన పార్టీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత వినయంగా ప్రజలవద్దకు మళ్లీ వెళ్లాలి. కానీ ఇప్పటికీ బుద్ది లేదు. పదిమంది నేతలుంటే రెట్టింపు సంఖ్యలో మాకంటే మాకంటూ అవకాశాలకోసో పోటీ పడేవాళ్లే ఎక్కువ. సమయమూ సందర్భమూ కూడా లేకుండా మళ్లీ ముఖ్యమంత్రి పాట ఎత్తుకున్నారు. సీఎం పోస్టు మాకంటే మాకని నిన్నా మొన్నటివరకు కుప్పి గంతులేశారు. ఇప్పుడు ఏకంగా గెలిస్తే మా సీఎం జానారెడ్డే నంటూ బీరాలు పోయారు. సరే ఏదో అభిమానం కొద్దీ అలా అని ఉంటారులే అని సర్ది చెప్పుకుని చూద్దాం అంటే ఆ అవకాశం కూడా ఇవ్వరు. జానాను సీఎంగా ప్రకటించే సందర్భంలో తమలోని ప్రత్యర్థిపై నాలుగు రాళ్లు వేయకుండా ఉండరు. టి.కాంగ్రెస్ నేతల వీరంగం ఎలా ఉందో వారి మాటల్లోనే చూద్దాం.
 
సీఎల్పీ నేత జానారెడ్డి నాయకత్వం వహించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఆయనే సీఎం అవుతారని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుం దని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు లేకుండా చూసే బాధ్యత సీఎల్పీ నేతపైనే ఉందన్నారు.
 
అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల చేయించిన సర్వే ఉత్తుత్తిదేనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 50 సీట్లల్లో గెలుస్తాం, మరో 20 సీట్లలో కష్టపడితే విజయం సాధిస్తామంటూ వచ్చిన రిపోర్ట్‌ ఎలా రూపొందించారన్నారు.
 
అయ్యా ఇదీ సంగతి. పార్టీలోపల ఐక్యత అనే పదానికి కూడా  అర్థం మర్చిపోయిన వీరు తెలంగాణ కాబోయే సీఎంలట. ఒకడు సీఎం పదవికి కాసుక్కూచుంటే, ఇంకొకడు వంతపాడేవాడు. వంతపాడుతూనే తన ప్రతికక్షిని తీసిపారేసేవాడు. 
 
వీళ్లకు ముఖ్యమంత్రి పదవి కావాలట మరి. జనం అప్పనంగా ఇచ్చేస్తారా