గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (14:03 IST)

రేవంత్ తాటతీస్తాం.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు : మంత్రి జూపల్లి

ఓటుకు నోటు కేసులో బెయిలుపై విడుదలైన ప్రధాన నిందితుడు, టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరిక చేశారు. రేవంత్‌రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని, ఆయన నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడని, ఇక తదుపరి జైలుకెళ్లే వంతు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని ఆయన జోస్యం చెప్పారు. 
 
బుధవారం జైలు నుంచి విడుదలైన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్యులపై ఘాటైన విమర్శలు గుప్పించిన విషయంతెల్సిందే. దీనిపై మంత్రి జూపల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసే అర్హత రేవంత్‌కు లేదన్నారు. రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. 
 
చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే నీవా? కేసీఆర్‌ను విమర్శించేది అని ధ్వజమెత్తారు. రేవంత్‌కు, టీడీపీకి తెలంగాణలో పుట్టగతులుండవని హెచ్చరించారు. కేసీఆర్ నిన్ను కేసులో ఇరికించాడని అంటున్నావు కదా, నీవేమైనా చిన్న పిల్లాడివా? అని నిలదీశారు. నోట్లో వేలు పెడితే కొరకవా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆడమన్నట్టు ఆడుతూ బరితెగించి మాట్లాడుతున్నావని దుయ్యబట్టారు. 
 
కేసీఆర్‌ను గద్దె దించుతానని మీసాలు తిప్పావు, తొడగొట్టావు... అసలు కేసీఆర్‌ను గద్దె దించే దమ్ము రేవంత్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మీ నాయకుడు చంద్రబాబును గద్దె దించి తెలంగాణలో అడ్రసు లేకుండా చేసింది కేసీఆర్ అని మరవొద్దన్నారు. మీ నాయకుడు చంద్రబాబుకు, కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. 
 
అమరవీరులు మీ పేర్లు రాసి ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. తెలగాణ సమాజం మిమ్మల్ని మీ పార్టీని అసహ్యించుకుంటుందని జూపల్లి చెప్పారు. వచ్చిన తెలంగాణను మీ పచ్చ జెండా వెనక్కి పంపిన విషయం ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పచ్చ పార్టీ కుట్రలు మానడంలేదన్నారు. అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. 
 
నీకు మానవత్వం ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆపేందుకు సీమాంధ్ర నాయకులు రాజీనామా చేసినపుడే నీవు కూడా చేసేవాడివని అన్నారు. మీరు ఇలాగే చేస్తూ పోతే గ్రామాల్లో మీ జెండా గద్దెలు ఉండవు, మీ పార్టీ ఉండదని హెచ్చరించారు. తినేది తెలంగాణ సొత్తు పాడేది చంద్రబాబు పాటనా? అని మండిపడ్డారు. ఇవాళ రేవంత్‌రెడ్డి జైలు నుంచి బయటకొచ్చాడు రేపు మళ్లీ జైలుకెళ్లక తప్పదని జూపల్లి జోస్యం చెప్పారు.