శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (16:12 IST)

వైఎస్ఆర్ ప్రభుత్వ సేవలు అద్భుతం : తెలంగాణ సీఎం కేసీఆర్

సంయుక్తాంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన సేవలు అద్భుతమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ప్రధానంగా 108 అంబులెన్స్ సేవలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రాణాలను కాపాడాయని శుక్రవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. 
 
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, తాను ఒకసారి పరకాల వెళుతుండగా, రోడ్డు ప్రమాదంలో ఓ మనిషి చావుబతుకుల మధ్య ఉండడంతో, తానూ కారు దిగానని, అక్కడున్న పిల్లలు "ఏం ఫర్వాలేదు, 10 నిమిషాల్లో 108 వస్తుంది" అని చెప్పారని కేసీఆర్ సభకు వివరించారు. జనంలో '108' పట్ల ఉన్న విశ్వాసాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు. 
 
అలాగే, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కూడా ఎంతో మంది పేదలకు పునర్జన్మనిచ్చిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక సేవలను అందుబాటులోకి తీసుకరానుందని సభా సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు.