మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 23 జూన్ 2015 (17:27 IST)

సెక్షన్ 8లో ఓటుకు నోటు దొంగలను పట్టుకోవద్దని ఉందా? : తెరాస ఎంపీ కేకే

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం సెక్షన్ 8ను అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు వస్తున్న ఊహాగానవార్తలపై ఆ రాష్ట్ర అధికార తెరాస పార్టీ నేతలు మండిపడుతున్నారు. వీరికితోడు టీ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. 
 
సెక్షన్ 8పై వస్తున్న ఊహాగానాలపై తెరాస రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మాట్లాడుతూ ఈ సెక్షన్‌ను కేంద్రం అమలు చేయబోతుందన్న సంకేతాలే లేవన్నారు. ఒకవేళ అమలు చేసినా ఈ సెక్షన్ వల్ల ఏమీకాదన్నారు. అయితే, సెక్షన్‌పై కొన్ని వర్గాలు అనవసర పుకార్లకు తెరలేపాయని మండిపడ్డారు. గవర్నర్‌కు ఇంతవరకు సెక్షన్ 8పై సమాచారమే లేదని చెప్పారు. 
 
ఈ సందర్భంగా ఆయన ఓటుకు నోటు అంశంపై మండిపడ్డారు. దొంగలను పట్టుకోవద్దని సెక్షన్ 8లో లేదు కదా? అని ప్రశ్నించారు. 'ఓటుకు నోటు' కేసును సెక్షన్ 8తో ముడిపెట్టవద్దని కోరారు. తెలంగాణలో దొంగలను, కుట్రలు చేసే వాళ్లను వదలబోమని స్పష్టం చేశారు. 
 
చట్టప్రకారమే ఏసీబీ నడుచుకుంటోందని, విచారణలో టీఆర్ఎస్ జోక్యం చేసుకోదని తెలిపారు. తెలంగాణ మంత్రివర్గాన్నికాదని గవర్నర్ నిర్ణయాలు తీసుకోరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రానికే పూర్తి హక్కులు ఉన్నాయన్నారు. కేబుల్ యాక్ట్ ప్రకారం టీ.న్యూస్‌కు నోటీసులు ఇచ్చే అధికారం ఏపీ పోలీసులకు లేదని కేకే చెప్పుకొచ్చారు.