తెరాస అధ్యక్ష పీఠంపై కేసీఆర్ ఏడోసారి... ప్లీనరీలో ప్రకటన!
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి ప్రతి రెండేళ్లకూ మళ్లీమళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్న ఈ గులాబీ బాస్.. ఇపుడు ఏడోసారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం హోదాలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఈసారి ప్రత్యేకత. 24న జరిగే పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించడమే మిగిలివుంది. అన్ని సందర్భాల్లోనూ కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం విశేషం.
తెరాస పార్టీని 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మధ్యలో కొన్నిసార్లు పార్టీ ఒడిదుడుకులకు గురైన సమయాల్లో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటికీ, అది ఎప్పుడూ ఆమోదానికి నోచుకోలేదు. ఈ నెల 24న జరిగే ప్లీనరీ వేదికపై నుంచి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికపై లాంఛనంగా ప్రకటన వెలువడనుంది.
పార్టీ సంస్థాగత ఎన్నికల నిబంధనల ప్రకారం కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవిలో రెండేళ్లపాటు (2015-17) కొనసాగుతారు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ సోమవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగింది. కేసీఆర్ ఒక్కరి తరపునే ఆరు దాఖలయ్యాయి.
కేసీఆర్ సంతకం చేసిన ఆరు నామినేషన్ పత్రాలను కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు.. అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మంత్రి నాయినికి అందజేశారు. అంతకంటే ముందు వారంతా సీఎం కేసీఆర్ను కలిశారు. నామినేషన్ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు.