శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (12:34 IST)

తెరాసపై రేవంత్ రెడ్డి విమర్శలు.. ఎర్రబెల్లికి కేసీఆర్ గాలం!

హైదరాబాద్ మెట్రో రైల్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం, నేతలపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు సొంత పార్టీ నేతల్లో విభేదాలు సృష్టిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్... టీటీడీపీ అసంతృప్తి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి సీనియర్ నేతలకు గాలం వేయడంలో దృష్టిసారించారు. 
 
గత రెండు రోజులుగా తెరాస నేతల్లో ఎర్రబెల్లి దయాకర రావు 'కేంద్రం'గా టీఆర్ఎస్, టీడీపీ‌ల మధ్య రసవత్తర రాజకీయాలు నడుస్తున్నట్టు సమాచారం. మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు ఎర్రబెల్లి‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా అత్యంత సన్నిహితుడు. మెట్రో భూముల విషయంలో రామేశ్వర రావు‌పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలతో ఎర్రబెల్లి విభేదించారు. చంద్రబాబు కూడా రేవంత్‌కే మద్దతిస్తున్నారని ఆయన కొన్ని రోజులుగా కినుక వహించినట్టు సమచారం. 
 
దీన్ని అవకాశంగా మలుచుకుని టీఆర్ఎస్ పార్టీ ఎర్రబెల్లిని తమ వైపుకు ఆకర్షించేందుకు ప్రయత్నించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామేశ్వర రావు మధ్యవర్తిత్వం ద్వారా ఎర్రబెల్లిని తమవైపుకు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని సమాచారం. అయితే, ఆఖరి నిమిషంలో టీడీపీ అప్రమత్తం కావడంతో... టీఆర్ఎస్ ప్రయత్నాలు సఫలం కాలేదని తెలుస్తోంది.
 
పైగా ఈ వార్తలను ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఖండించకపోవడం విశేషం. టీఆర్ఎస్‌లోకి రావాల్సిందిగా తనపై ఐదురోజులుగా విపరీతమైన ఒత్తిడి వచ్చిందని ఆయన తెలిపారు. అయితే, దీనికి తాను అంగీకరించలేదని.. జీవితాంతం తాను టీడీపీలోనే కొనసాగుతానని, చంద్రబాబే తన నాయకుడని ఆయన స్పష్టం చేశారు. తనకు ఆదివారం రాత్రి 11 గంటలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చిన మాట నిజమేనని ఎర్రబెలి తెలిపారు. కేవలం, కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి గురించి మాట్లాడటానికే తాను సీఎం కేసీఆర్‌ను కలవాలనుకున్నట్టు ఎర్రబెల్లి వివరణ ఇచ్చి సరిపుచ్చుకున్నారు.