గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By tj
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (12:17 IST)

తిరుమలలో వివాదాస్పదంగా మారిన కేసీఆర్ పర్యటన...!

ఆయన తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి. మొదటిసారి ఏపీకి వచ్చారు. అది కూడా సీఎం హోదాలోనే. ఇక ఆయనకు ఎలాంటి స్వాగతం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొంతమంది తెలంగాణ నేతలు మరింత అత్యుత్సాహం ప్రదర

ఆయన తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి. మొదటిసారి ఏపీకి వచ్చారు. అది కూడా సీఎం హోదాలోనే. ఇక ఆయనకు ఎలాంటి స్వాగతం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొంతమంది తెలంగాణ నేతలు మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమలలో గజమాలలు, ప్లకార్డులు అనుమతించరు. సాధారణంగా తిరుమలలో పువ్వులనే పెట్టుకోకూడదు. అలాంటి భారీ గజమాలతో వస్తే ఇక అంతే. వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
 
అలాంటిది చెన్నైకు చెందిన తెలుగునాడు యువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఏకంగా గజమాలలు, ప్లకార్డులతో తిరుమలకు వచ్చేశారు. అది కూడా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే రహదారిలో టోల్‌గేట్ ఉంటే వాటిని తప్పించుకుని తనిఖీలు లేకుండానే రావడం టిటిడి విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
 
మంగళవారం రాత్రి ఒక్కసారిగా కేసీఆర్ ఉన్న కృష్ణా అతిథి గృహంకు వచ్చిన కేతిరెడ్డి అనుచరులు నినాదాలు చేసుకుంటూ ప్లకార్డులను పట్టుకుని గజమాలలతో లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి నుంచి గజమాలలు, ప్లకార్డులను స్వాధీనం చేసుకున్నారు. 
 
అంతకుముందు తిరుపతి పట్టణ వ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినా సరే కేసిఆర్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లపై కొంతమంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రాంత నేతలను అత్యుత్సాహం ప్రదర్శించడంతో స్థానిక నేతలు విస్తుపోయారు. 
 
ఎన్నికల కోడ్ ఉంటే అది ఏ పార్టీ అయినా దానిని  అనుసరించాలి. అలాంటి తెలంగాణా ప్రాంతంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలే ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఎన్నికల కోడ్ ఉంటే ఫ్లెక్సీలను, బ్యానర్లను ఏర్పాటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. కానీ ఇది రెండు రాష్ట్రాలకు చెందిన విషయం కాబట్టి పోలీసులు కూడా సైలెంట్ అయిపోయారు.