గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (12:49 IST)

'ఉమ్మడి'గానే బాగున్నది.. తెలంగాణ కోసం కొట్లాడి బాధపడుతున్నా...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన రాజకీయ నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన ఎంపీగా ఉన్నారు. ఇపుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని బాగుండేవన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినందుకు ఇపుడు బాధపడుతున్నట్టు తెలిపారు.
 
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మాటలు విన్న తర్వాత రాష్ట్రం ఉమ్మడిగానే ఉంటే బాగుండేదని తనకు అనిపిస్తోందన్నారు. గతంలో ఎంపీగా పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడినందుకు ఇప్పుడు బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
 
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ వచ్చిందని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే పార్టీని కరోనా వైర్‌సతో పోల్చడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను గౌరవించాలన్న ఇంగితజ్ఞానం సీఎంకు లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆదిష్టానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. పార్టీ సరైన నిర్ణయం తీసుకోకుంటే తమదారి తాము చూసుకుంటామన్నారు. 
 
తమ పార్టీ ఎంపీ ఏ.రేవంత్‌ రెడ్డి విషయంలో పార్టీకి నష్టం కలిగించేలా కొందరు నాయకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే జూనియర్లను ప్రోత్సహించాల్సింది పోయి.. విమర్శలు చేయడం సరికాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయడ్డారు.