శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జులై 2020 (13:35 IST)

గర్భిణీ భార్యను భుజంపై 3 కిలోమీటర్లు మోశాడు.. కానీ అడవిలోనే ప్రసవం..

మనదేశంలో కనీసం విద్యుత్, రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలు చాలానే వున్నాయి. అలాగే ఆదివాసీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. ఆస్పత్రులు లేక గర్భిణీ మహిళలు ప్రాణాపాయ స్థితిలో కిలోమీటర్లు దూరం నడవాల్సిన పరిస్థితి ఇప్పటికీ వుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే భద్రాద్రిలో చోటుచేసుకుంది. 
 
తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రహదారి సౌకర్యం లేక.. అంబులెన్స్ వచ్చే పరిస్థితిలేక.. అడవిలోనే ఓ మహిళ ప్రసవించింది. చర్ల మండలంలోని కీకారణ్యమైన ఎర్రంపాడుకి చెందిన కొవ్వాసి ఐతే అనే నిండు గర్భిణీ... పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో.. కాలినడకలోనే ఎర్రంపాడు నుండి చెన్నారం వరకు మూడు కిలోమీటర్లు మోసుకెళ్లాడు ఆమె భర్త మాస, ఆయనకు ఆశా కార్యకర్త సోమమ్మ సహాయం చేసింది. ఇక, ఫోన్ సిగ్నల్ దొరకడంతో.. స్థానికుంగా ఉన్న యువకులు 108కి ఫోన్ చేశారు.
 
అయితే.. 108కి వచ్చేసరికే అడవిలోనే ప్రసవించి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఐతే.. ఇక, ఆ తర్వాత.. బాలింతను, శిశువును 108లో ప్రాథమిక చికిత్స తర్వాత.. సత్యనారాయణపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.