శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 13 జులై 2017 (07:55 IST)

కలెక్టర్‌ చేయిని కావాలనే పట్టుకొని... ‘పొరపాటున తగిలి ఉంటే..’అంటారా: జనం ఫైర్

జిల్లా కలెక్టర్‌ నాకు సొదరిలాంటిది. కలెక్టర్‌ అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎస్టీ వర్గానికి చెందినవాడిని. ఆమె కూడా ఎస్టీ వర్గానికి చెందినదే. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఒకవేళ జనంలో పొరపాటున చేయి తగిలి ఉంటే, క్షమాపణలు కోరుతున్నా’అని వివరణ ఇచ్చినట్లు మహబ

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతి మీనాకు తీవ్ర అవమానం జరిగింది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కలెక్టర్‌ను, పైగా మహిళనైన తనను చేయితో తాకాల్సిన అవసరం ఏముందంటూ ఆమె ఆగ్రహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
‘జిల్లా కలెక్టర్‌ నాకు సొదరిలాంటిది. కలెక్టర్‌ అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎస్టీ వర్గానికి చెందినవాడిని. ఆమె కూడా ఎస్టీ వర్గానికి చెందినదే. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఒకవేళ జనంలో పొరపాటున చేయి తగిలి ఉంటే, క్షమాపణలు కోరుతున్నా’అని వివరణ ఇచ్చినట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కలెక్టర్‌ చేయిని కావాలనే పట్టుకొని... ఇప్పుడు ‘పొరపాటున తగిలి ఉంటే..’అంటారా అని ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు.
 
ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎన్ని వాదనలు చేసినా మహళా కలెక్టర్ ప్రీతి మీనా చేతిని తాకుతున్నట్లు స్పష్టంగా మీడియా వీడియో ఫుటేజీల్లో కనిపించింది. పైగా మానుకోట ఎమ్మెల్యే తన చేయి పట్టుకోవడంతో కలెక్టర్ ప్రీతి మినా నిర్ఘాంతపోవడమే కాకుండా బీ ఇన్‌ యువర్‌ లిమిట్‌..’ అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. అంతేకాకుండా ఐఏఎస్‌ల సంఘం, సీఎస్‌తోపాటు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌ కలెక్టర్‌కు ఉద్యోగులు బాసటగా  నిలిచిన తర్వాతే పరిస్థితి అదుపుతప్పిందని గ్రహించిన టీఆరెస్ ప్రభుత్వం తక్షణం స్పందించి ఎమ్మెల్యే చేత క్షమాపణ చెప్పించింది. 
 
ఏం జరిగిందంటే...హరితహారంలో భాగంగా బుధవారం మొక్కలు నాటడం పూర్తయ్యాక స్టేజీ వద్దకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ కలెక్టర్‌ ప్రీతి మీనా చేయి పట్టుకొని ముందుకు పదండని అన్నారు. దీంతో ఆమె నిర్ఘాంతపోయారు. అక్కడే ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ‘ఐ యామ్‌ కలెక్టర్‌.. బీ ఇన్‌ యువర్‌ లిమిట్‌’అంటూ హెచ్చరించారు. అక్కడ్నుంచి సభావేదికపైకి వెళ్లారు. సభ ముగిసేంత వరకు మిన్నకుండిపోయారు. కార్యక్రమం ముగియగానే జేసీ దామోదర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ ఆయూబ్‌ అలీని పిలిచి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాగా, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీనాతో గతంలో పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు జిల్లాకు చెందిన ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో చేతులతో తాకడం, దురుసుగా మాట్లాడడం, పలుమార్లు దుర్భాషలాడినట్లు తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్‌ సీనియర్‌ అధికారుల వద్ద ఎమ్మెల్యే తీరుపై పలుమార్లు కంటతడి కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కావడంతో ఏం చేయలేక, చూసీచూడనట్లు వ్యవహరించినట్లు చెబుతున్నారు. 
 
ఎమ్మెల్యే వైఖరిపై కలెక్టర్‌ ఆరు నెలల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా స్థాయి అధికారులతో కూడా ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడుతారని పలువురు అధికారులు చెబుతున్నారు. రారా, పోరా, వాడు, వీడు అని వ్యాఖ్యానించినా ఏం చేయలేక, మౌనంగా ఉంటున్నామని అధికారులు వాపోతున్నారు.
 
ఐఏఎస్‌ అధికారిపై ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించిన సంఘటన ఇటు ప్రభుత్వాన్ని, అటు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులను కలవరపరిచింది. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ గతంలోనూ ఒక భూమి విషయంలో స్థానిక మహిళా తహశీల్దార్‌ను ఇంటికి పిలిపించి దుర్భాషలాడినట్టు ఫిర్యాదులున్నాయి. ఇప్పుడు ఏకంగా కలెక్టర్‌కు చేదు అనుభవం ఎదురవటంతో అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు అందరి నోటా చర్చనీయాంశంగా మారింది.