శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (13:15 IST)

మహారాష్ట్రలో ఎంఐఎం 2 చోట్ల ఖాతా : అసదుద్దీన్ హర్షం!

ఆదివారం వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఎంఐఎం పార్టీ రెండు చోట్ల ఖాతా తెరిచింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ గెలుపుపై ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం తమకు మంచి ఊపునిచ్చిందన్నారు. అందువల్ల తమ పార్టీని మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించనున్నట్టు తెలిపారు. 
 
 
ఆదివారం వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం రెండు సీట్లలో గెలుపొందిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలపై ఆయన హైదరాబాద్‌లో స్పందిస్తూ.. ఇప్పటి వరకు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పరిమితమైన తాము ఇపుడు ముంబై నగరంలోనూ పాగా వేశామన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించనున్నట్టు తెలిపారు. 
 
కాగా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జర్నలిస్టు సయ్యద్ ఇంతియాజ్ జలీల్, ముంబై నగరంలోని బైకలా నియోజకవర్గం నుంచి న్యాయవాది వారిస్ యూసుఫ్ పఠాన్‌లు ఎంఐఎం పార్టీ తరఫున విజయం సాధించారు. 
 
ఇంతియాజ్ శివసేన అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రదీప్ జైస్వాల్‌ను 20 వేల ఓట్ల తేడాతో, వారిస్ బీజేపీ అభ్యర్థి మధుకర్ చవాన్‌ను 1,357 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికలలో మహారాష్ట్రలో ఎంఐఎం మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసింది.