మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 15 జూన్ 2017 (03:23 IST)

మొన్న ప్రదీప్, నిన్న శిరీష.. సెలబ్రిటీలు, వారికి సేవ చేసేవారు కూడా చస్తూ బతకాల్సిందేనా..

సెలబ్రెటీలు, వారికి సంబంధిత రంగాలకు సంబంధించిన వారు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. బుల్లితెర హీరో ప్రదీప్‌కుమార్‌ ఆత్మహత్యను పూర్తిగా మర్చిపోకముందే ముందే శిరీష తనువు చాలించడం ఉలిక్కిపడేలా చేసింది. బుల్లితెరపై తనకంటూ ఓ ముద్ర వేసుకుని, రం

సెలబ్రెటీలు, వారికి సంబంధిత రంగాలకు సంబంధించిన వారు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. బుల్లితెర హీరో ప్రదీప్‌కుమార్‌ ఆత్మహత్యను పూర్తిగా మర్చిపోకముందే ముందే శిరీష తనువు చాలించడం ఉలిక్కిపడేలా చేసింది. బుల్లితెరపై తనకంటూ ఓ ముద్ర వేసుకుని, రంగుల ప్రపంచంలో ఎదుగుతున్న ప్రదీప్‌ మే 3న ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా క్షణికావేశానికి లోనై ప్రాణం తీసుకున్నారు. ఆ వ్యవహారంలోనూ శ్రవణ్‌ అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు శిరీష–ప్రభాకర్‌రెడ్డిల ఆత్మహత్యలతో నగరంలో మరోసారి కలకలం రేగింది.
 
బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలోని ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలో మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్‌ శిరీష జీవితం విషాదాంతమైంది. మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఉదంతం బుధవారం సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లిలో ఎస్‌సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు దారి తీసింది. కర్ణాటకలోని గంగావతి ప్రాంతానికి చెందిన శిరీష ప్రాథమిక విద్యను ఏపీలో ఉన్న గుంటూరులోని ఎస్‌జీవీఆర్‌ హైస్కూల్‌లో పూర్తి చేశారు. గుల్బర్గా యూనివర్శిటీలో ఉన్నత విద్యనభ్యసించిన శిరీష హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 
 
మేకప్‌ ఆర్టిస్టుగా పని చేస్తున్న ఆమె తన పనిని ఎంతగానో ప్రేమిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో రాసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘శిరీష మేకర్‌ ఆర్ట్‌’ పేరుతో ఓ ఫేస్‌బుక్‌ పేజ్‌ని సైతం నిర్వహిస్తున్నారు. తాను పని చేస్తున్న ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోకు వచ్చే వారికి వివిధ రకాలైన మేకప్‌లు చేయడంతో పాటు వివాహాది శుభకార్యాలు జరిగినప్పుడు అవసరమైన బ్రైడల్‌ మేకప్‌ చేయడంలోనూ తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్నారు.
 
భర్త, కుమార్తెతో సజావుగా సాగిపోతున్న శిరీష జీవితంలోకి సినీ రంగంలో ఫ్రీలాన్స్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న వల్లభనేని రాజీవ్‌తో ఏర్పడిన పరిచయం నాలుగేళ్ళకు ఓ కుదుపును తెచ్చింది. తేజస్విని అనే మహిళ కారణంగా వీరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. రాజీవ్‌ స్నేహితుడైన శ్రావణ్‌ ద్వారా ఈ వివాదం కుకునూర్‌పల్లి ఎస్‌సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు చేరింది. గత శుక్రవారమే పుట్టిన రోజు జరుపుకున్న శిరీష.. రాజీవ్‌–శ్రావణ్‌లతో కలిసి సోమవారం కుకునూర్‌పల్లి వెళ్ళింది. మంగళవారం తెల్లవారుజామున తిరిగి వచ్చి ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.