మెదక్ బై పోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా సునితా లక్ష్మారెడ్డి!
మెదకు లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. అలాగే, టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పలువురు ముఖ్యులతో మంతనాలు జరిపారు. మరోవైపు కాంగ్రెస్ కూడా రాత్రి 10 గంటల సమయంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేసింది. దీనిపై సాయంత్రం నుంచే మీడియాలో ప్రచారం జరిగింది. టీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థిత్వాలపై రోజంతా వేచి చూసిన కాంగ్రెస్ పెద్దలు ఆఖరికి సునీతా లక్ష్మారెడ్డివైపే మొగ్గు చూపారు.
ఆమె పేరును పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ రాత్రి ఢిల్లీలో ధ్రువీకరించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకూ సమాచారం అందింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కూడా సునీ తకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కాగా, నామినేషన్ల దాఖలుకు బుధవారం చివరి రోజు కావడంతో మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాన్ని సమర్పించాలని ఆమె నిర్ణయించారు.