శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (12:43 IST)

జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ : పవన్ కళ్యాణ్ ఛరిష్మాతోనేనా?

సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ లోక్‌సభకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే, అనూహ్యంగా జగ్గారెడ్డి పేరును బీజేపీ ఖరారు చేయడం వెనుక జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఛర్మిష్మా ఉన్నట్టు సమాచారం. 
 
ఎందుకంటే.. రాష్ట్ర విభజన సమయంలో కరుడుగట్టిన సమైక్యవాదిగా జగ్గారెడ్డి ముద్ర వేయించుకుని, రాష్ట్రం విడిపోతే ఇరు ప్రాంతాలకు తీరని నష్టం జరుగుతుందంటూ తెలంగాణ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ బహిరంగంగా మనస్సులోని మాటలను వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో జగ్గారెడ్డికి మంచి పేరుంది. పైపెచ్చు.. టీఆర్ఎస్‌ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్మూధైర్యం జగ్గారెడ్డికి మాత్రమే ఉన్నాయంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. 
 
మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమి విజయభేరీ మోగించడం వెనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం, ఛరిష్మా బాగా పని చేసింది. అలాంటి పవన్‌ కళ్యాణ్‌తో మంచి సంబంధాలు జగ్గారెడ్డికి ఉన్నాయి. పైపెచ్చు.. జగ్గారెడ్డి వంటి వారు మెదక్ లోక్‌సభకు పోటీ చేస్తే తనవంతు మద్దతు ఇస్తానని పవన్ కళ్యాణ్ బహిరంగంగా కూడా ప్రకటించారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేసింది. టీడీపీ, బీజేపీ సొంత బలంపై నమ్మకమున్నా లేకపోయినా.. తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్‌ ఛరిష్మాను ఉపయోగించుకోవాలని జగ్గారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినట్టు తెలుస్తోంది. మొత్తంమీద మెదక్ లోక్‌సభ బరిలో బీజేపీ సరైన అభ్యర్థినే బరిలోకి దించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.