శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (19:45 IST)

వంద రోజుల్లో మేం చేసింది శూన్యం : మెదక్‌ గెలుపు వారిదే.. కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో తాము చేసింది ఏమీ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలనపై స్పందించేందుకు అదేమైనా వంద రోజున సినిమానా అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. పైపెచ్చు.. మెదక్ ఉప ఎన్నిక తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం కాదన్నారు. 
 
సోమవారం వెల్లడైన మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితంపై ఆయన స్పందిస్తూ ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించినందుకు మెదక్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. కార్యకర్తల కృషి వల్లే మెదక్‌లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సాగించిన గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. టీడీపీతో కలిసినందుకు బీజేపీకి గట్టి దెబ్బే తగిలిందన్నారు. తెలంగాణాలో టీడీపీకి స్థానం లేదని తెలంగాణ ప్రజలు మరోమారు రుజువు చేశారని చెప్పారు. 
 
ఇకపోతే.. తెలంగాణాలోని ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కేసీఆర్ సూచించారు. ఇచ్చిన హామీలన్నీ వందశాతం నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. పటిష్టమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. కేసీఆర్ మార్కు, టీఆర్ఎస్ మార్కు పాలన ఇంకా మొదలుకాలేదన్నారు. అర్హులకే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని, దసరా నుంచి దీపావళి మధ్య చాలా ఉత్తర్వులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు.