శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 25 నవంబరు 2015 (15:38 IST)

గురువారం పెళ్లి... విషపు ఇంజెక్షన్ తీసుకుని మెడికో ఆత్మహత్య...

బంగారు జీవితం గడపాల్సిన ఓ మెడికల్ విద్యార్థిని అనూహ్యంగా మారిపోయిన కుటుంబ పరిస్థితుల కారణంగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం నాడు పెళ్లి కూతురై ఓ ఇంటిది కావాల్సిన తరుణంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నాగోల్ సమతాపురి కాలనీలోని రోడ్‌ నంబర్ 3లో నివసించే 29 ఏళ్ల ఆలూరి కినీరా ఓయూ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్నది.
 
ఆమెను డాక్టరుగా చూడాలనుకున్న ఆమె తండ్రి సజన్న ఈ ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి కినీరా మనస్తాపంతో తీవ్రంగా వేదన చెందుతోంది. ఐతే కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టాలని నిశ్చయించుకున్న ఆమె తల్లి కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన డాక్టర్‌తో వివాహం చేసేందుకు నిర్ణయించింది. గురువారం నాడు పెండ్లి జరగాల్సి ఉంది.
 
తన తల్లి, బంధువులతో కలిసి ఆమె సోమవారం నాడు షాపింగ్ కూడా చేసింది. ఇక రెండు రోజుల్లో పెళ్లి అని అనుకుంటుండగా సోమవార రాత్రి విషపు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణం కుటుంబ పరిస్థితులే అని చెప్పుకుంటున్నారు. ఆమె వారికి ఒక్కగానొక్క కుమార్తె. తండ్రి మరణంతో తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లి ఒంటరైపోతుందన్న ఆవేదనతో ఆమె ఈ పనికి పాల్పడినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.