గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (14:52 IST)

మోత్కుపల్లికి బంపర్ ఆఫర్.. గవర్నర్ గిరి.. బాబుకు సమాచారం!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు బంపర్ ఆఫర్ తగిలింది. ఆయనకు గవర్నర్ పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను త్వరలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దానికి గవర్నర్‌గా నియమించవచ్చుననే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఈ విషయమై సమాచారం ఇచ్చినట్టు సమాచారం. 
 
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు నేపథ్యంలో అటు కేంద్రంతో పాటు ఇటు ఏపీలో పదవులను పంచుకోవాలన్న రెండు పార్టీల నిర్ణయం మేరకే మోత్కుపల్లికి గవర్నర్ గిరి దక్కనుంది. గడచిన ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపని మోత్కుపల్లి, తనను రాజ్యసభ సభ్యుడిగా పంపాలని చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. 
 
అయితే ఎన్డీఏ అధికారంలోకి వస్తే, గవర్నర్ పదవి ఇప్పిస్తానన్న చంద్రబాబు హామీతో రాజ్యసభ సీటు డిమాండ్‌ను మోత్కుపల్లి విరమించుకున్నారు. అనుకున్నట్లుగానే ఎన్డీఏ అధికారంలోకి రావడం అటు కేంద్రంలోనే కాక, ఇటు ఏపీలోనూ రెండు పార్టీల నేతలకు పదవుల పంపిణీ జరిగిపోయింది. ఈ క్రమంలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కనుంది. అయితే, ఏ రాష్ట్రానికి మోత్కుపల్లి గవర్నర్‌గా వెళతారనే విషయం త్వరలోనే తేలిపోనుంది.