గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (16:52 IST)

కేసీఆర్‌ను ఎన్నిసార్లు ఉరితీయాలో : టీటీడీపీ నేతల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు మంగళవారం బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యలపై వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. 
 
రైతులను ఆదుకుంటామని, అండగా ఉంటామని, ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కొత్త కార్లకు బదులు బాధిత కుటుంబాలకు సాయం చేయాలని రేవంత్ ప్రభుత్వానికి సూచించారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. 
 
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వారు ఆరోపించారు. కేసీఆర్ ఫాం హౌస్‌కు 24 గంటల విద్యుత్ ఇచ్చి రైతులకు రెండు గంటలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇన్ని ఆత్మహత్యలకు కారకుడైన కేసీఆర్‌ను ఎన్నిసార్లు ఉరితీయాలన్నారు.