బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (18:27 IST)

ఫాం హౌసుకు తీసుకెళ్లింది నేనే.. ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ చేశాడు: చంద్రకళ

హిమాయత్ నగర్ కాల్పుల కేసులో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ స్నేహితురాలు చంద్రకళ స్టేట్ మెంట్ తీసుకున్నారు. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6లో జరిగిన ఈ కాల్పుల కేసులో శశి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫాంహౌస్ యజమాని చంద్రకళ చెప్పిన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. 
 
ఈ సందర్భంగా చంద్రకళ సోమవారం సాయంత్రం ఉదయ్ కుమార్‌పై కాల్పులు జరిపిన అనంతరం శశికుమార్ తన వద్దకు వచ్చాడని, తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని చెప్పినట్లు తెలిపింది. ఫాం హౌస్‌కు తీసుకెళ్లమని కోరడంతో తన కారులో ఫాం హౌస్‌కు తీసుకెళ్లానని ఆమె వెల్లడించారు. ఫాం హౌస్‍లో జాగ్రత్తగా చూసుకోవాలని వాచ్ మెన్ శంకరయ్యకు చెప్పి ఇంటికి చేరుకోగానే శశికుమార్ ఫోన్ చేశారన్నారు. 
 
ఈ సందర్భంగా పది నిమిషాల పాటు శశికుమార్ మాట్లాడగా, చివర్లో ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ పెట్టేశారని చెప్పారు. దీంతో, వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చి, వారితో కలిసి ఫాం హౌస్‌కు వచ్చానని, అప్పటికే శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు.