శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By eswar
Last Modified: శుక్రవారం, 25 జులై 2014 (19:13 IST)

చిన్నారి గొంతు కోసి చంపిన దుర్మార్గులు...

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి గొంతుకోసి హతమార్చారు దుర్మార్గులు. అర్థరాత్రి సమయంలో చిన్నారిని హతమార్చి పక్కనే ఉన్న పొదల్లో పడేశారు. చిన్నారి హత్య ప్రస్తుతం మిస్టరీగా మారింది. అసలు ఇది బయటి వారి పనా లేక... కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారా... అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
 
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని మూల తండాకు చెందిన హన్మంతుకు ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత భార్య టిబీ వ్యాధితో మరణించింది. దీనితో ఆ తర్వాత చంద్రకళను రెండో వివాహం చేసుకున్నాడు హనుమంతు.  ఆమెకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. నలుగురు సంతానంతో రెండో భార్య చంద్రకళతో కలిసి జీవిస్తున్నాడు. హనుమంతు ఇంటి పక్కనే ఇద్దరు భార్యల తమ్ముళ్లు కూడా నివాసం ఉంటున్నాడు.
  
హన్మంతు సొంత పనుల మీద బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి రాకపోవడంతో నలుగురు పిల్లలతో కలిసి ఇంట్లోనే పడుకుంది చంద్రకళ. అర్థరాత్రి సమయంలో చంద్రకళ పెద్ద కూతురు కృష్ణవేణి నీళ్లు కావాలని అడిగితే... నీళ్లు తాగించి పడుకోబెట్టింది. కొద్దిసేపటి తర్వాత చిన్న కూతురు లేచింది. ఆసమయంలో పెద్ద కూతురు కృష్ణవేణి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. 
 
ఆ బాలిక చెట్ల పొదల్లో గొంతుకోసిన స్థితిలో విగత జీవిగా కనిపించింది. కన్న కూతురు ప్రాణాలతోనే ఉందని భావించిన ఆ తల్లి నీళ్లు తాగించే  ప్రయత్నం చేసింది. నోట్లో పోసిన నీళ్లు గొంతులోంచి బయటికి రావడంతో గుండె పగిలేలా ఏడ్చింది ఆ తల్లి. చిన్నారిని అత్యంత కిరాతకంగా హతమార్చడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు స్థానికులు. ఎవరికి ఎలాంటి నష్టాన్ని కలిగించని ఆ చిన్నారిని హతమార్చిన తీరు చూస్తుంటె గుండె తరుక్కుపోతోందని అంటున్నారు స్థానికులు. 
 
బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఈ కుటుంబంలో విషాదాన్ని నింపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారిని హతమార్చాల్సిన అవసరం బయటి వారికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి అయిన వారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త హనుమంతు ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానంతో పాటు మొదటి భార్య సోదరుడు ఈర్ష్యతో ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.