శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (09:31 IST)

నాకు రాజకీయాలు కొత్త కాదు... పాదయాత్ర చేస్తా : సుహాసిని

తనకు, తన కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదని దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని అంటున్నారు. పైగా, పుట్టినిల్లుతో పాటు మెట్టినిల్లు కూడా రాజకీయ నేపథ్యంతో ముడిపడివున్న కుటుంబాలేనని ఆమె గుర్తుచేశారు. అందువల్ల తనకు రాజకీయాలు కొత్తకాదనీ, కానీ, ఇపుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో హైదరాబాద్, కూకట్‌పల్లి స్థానం నుంచి ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు.
 
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేందుకు పాదయాత్ర చేస్తానని చెప్పారు. తద్వారా స్థానిక సమస్యలేంటో తెలుసుకుంటానని చెప్పారు. ముఖ్యంగా, ట్రాఫిక్, తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారనీ వాటిని పరిష్కరించేందుకు శక్తిమేరకు కృషి చేస్తానని తెలిపారు.
 
తాను తెలంగాణ ఆడబిడ్డనని, ఖచ్చితంగా కూకట్‌పల్లి ప్రజలు భారీ మెజార్టీతో తనను గెలిపిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. అదేసమయంలో ఎన్నికల ప్రచారానికి తమ కుటుంబ సభ్యులంతా వస్తారని చెప్పారు. తాతయ్య స్థాపించిన టీడీపీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.