బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (13:09 IST)

నాందేడ్ ప్యాసింజర్ రైలు డ్రైవర్ షాక్... 4 గంటల ఆలస్యం వల్లేనా...?

అప్పటికే నాలుగు గంటల ఆలస్యంగా నడుస్తున్న నాందేడ్ ప్యాసింజర్ సరిగ్గా మెదక్ జిల్లా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్దకు రాగానే ట్రాక్ మీద అడ్డంగా వున్న స్కూలు బస్సును చూసి రైలు డ్రైవర్ బిక్షపతిగౌడ్ షాక్ అయ్యాడు. కనీసం బ్రేక్ వేసి రైలు ఆపే అవకాశం కూడా లేకపోవడంతో బస్సును ఢీకొని రైలు ముందుకు ఈడ్చుకుపోయింది. 
 
అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న రైలు డ్రైవర్ బిక్షపతి గౌడ్ సడెన్ బ్రేక్ కూడా వేయలేకపోయాడు. ఎందుకంటే రైలుకు సడెన్ బ్రేక్ వేస్తే వెనుక ఉన్న బోగీలన్నీ పట్టాలు తప్పి ఇంకా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం వుంది. అందుకే రైలు డ్రైవర్ రైలుకు నెమ్మదిగా బ్రేకులు వేశాడు. అయినప్పటికీ ప్రమాదానికి గురైన బస్సును అర కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళిన తర్వాతే రైలు ఆగింది. ఈ అరకిలోమీటరు దూరం రైల్వే ట్రాక్ రక్తసిక్తమైంది. 
 
మరోవైపు.. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాద ఘటన నాందేడ్ ప్యాసింజర్ రైలు ఆలస్యంగా ప్రయాణిస్తుండటం వల్లే చోటుచేసుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి నాందేడ్ ప్యాసింజర్ నేడు నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆ ఆలస్యమే చిన్నారుల పాలిట మృత్యుఘడియలుగా మారింది. 
 
మాసాయిపేట లెవల్ క్రాసింగ్ ద్వారా ప్రయాణించే డ్రైవర్లందరికీ రైళ్ళ రాకపోకల సమయాలు తెలిసి ఉంటాయి కాబట్టే, ఆ సమయంలో ఏ రైలూ రాదని కాకతీయ విద్యామందిర్ స్కూల్ డ్రైవర్ మొండిగా బస్సును ముందుకురికించి ఉంటాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
ఇక, పట్టాలపైకి వచ్చిన బస్సును ఒక్కసారిగా చూసినా బ్రేకులు వేయలేని నిస్సహాయత రైలు డ్రైవర్లది. సడెన్ బ్రేక్ వేస్తే మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పే అవకాశం ఉండడంతో వారు నిదానంగా బ్రేకులు వేయగా, బస్సును ఢీకొన్న రైలు అరకిలోమీటరు తర్వాత నిలిచిపోయిందని వారు చెపుతున్నారు.