మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (15:05 IST)

రైలు ప్రమాద చిన్నారుల మృతులపై స్పష్టత ఇవ్వని అధికారులు!

మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో గురువారం ఉదయం స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ప్రమాదంలో... ఎంతమంది చిన్నారులు మరణించారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన జరిగినప్పుడు బస్సు డ్రైవర్, క్లీనర్‌తో పాటు 13 మంది పిల్లలు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. కానీ, ఘటనా స్థలం నుంచి అందిన సమాచారం మేరకు 20 మంది చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది. 
 
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరికొంతమంది తుదిశ్వాస విడిచారు. మరో 23 మంది పిల్లలు సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత బస్సులో 30 మంది చిన్నారులున్నారని వార్తలొచ్చాయి. కానీ, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో 40 మందికి పైగా పిల్లలున్నట్లు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృత్యువాత పడటంతో... సంతాప సూచకంగా సెలవు ప్రకటించినట్టు డీఈవో తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని... స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.