బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (09:10 IST)

నాయిని నర్సింహారెడ్డి అల్లుడి సెటిల్‌మెంట్ దందా... బ్లేడుతో గొంతు కోసుకున్న బాధితుడు!

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి చేసిన సెటిల్‌మెంట్ దందా ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నారాయణగూడ లింగంపల్లిలోని ప్రగతి ప్రైడ్‌ అపార్ట్‌మెంట్‌లో ఈ దందా సాగింది. నాయిని అల్లుడి సమక్షంలో ఆయన అనుచరులు కొట్టిన దెబ్బలను తాళలేక వారినుంచి తప్పించుకుని వచ్చిన ఓ బాధితుడు... అపార్ట్‌మెంట్ ప్రధాన గేటు వద్ద బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వాచ్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతజరిగినా.. నాయిని అల్లుడిపై హైదరాబాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయక పోవడం గమనార్హం. రాష్ట్ర హోం మంత్రి కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు వారు చెపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మయూరి టక్కర్‌ అనే మహిళ తల్వార్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తి ద్వారా నవీన్‌, సుధీర్‌ అనే ఇద్దరితో పరిచయం ఏర్పడింది. తాను పెద్ద పారిశ్రామికవేత్తనని వారిని నమ్మించి వారి నుంచి తొలుత రూ.5 లక్షలు రుణం తీసుకుంది. దీనికి క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ రావడంతో వారిద్దరికి ఆమెపై మంచి నమ్మకం ఏర్పడింది. దీన్ని అదునుగా చేసుకున్న మయూరి.. పరిశ్రమ విస్తరణ పేరిట మరో రూ.50 లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరగా, వారు మాత్రం రూ.38 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఇది తొమ్మిది నెలల క్రితం జరిగింది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోపు తిరిగి చెల్లిస్తానని ఆమె లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. గడువు దాటినా ఆమె డబ్బులు చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చేది. మరోవైపు నవీన్‌, సుధీర్‌లు వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో డబ్బులు చెల్లించాలని ఆమెపై ఒత్తిడి పెంచారు. 
 
ఈ ఒత్తిడిని తట్టుకోలేని మయూరి.. వారిపై తిరగబడింది. తన వ్యాపార భాగస్వామి దీపక్‌ ద్వారా నవీన్‌, సుధీర్‌లను బెదిరించింది. ఈ క్రమంలో... విషయాన్ని సెటిల్‌ చేసుకుందామంటూ శుక్రవారం సాయంత్రం హోంమంత్రి అల్లుడు శ్రీనివాస రెడ్డి ఆఫీసుకు రావాలని వారికి చెప్పింది. దీంతో... నారాయణగూడ లింగంపల్లిలోని ప్రగతి ప్రైడ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉన్న శ్రీనివాసరెడ్డి కార్యాలయానికి నవీన్‌, సుధీర్‌ చేరుకున్నారు. వచ్చీ రాగానే శ్రీనివాస్‌ రెడ్డి అనుచరులు తల్వార్లతో వీరిపై దాడి చేశారు. 
 
దీంతో భయపడిపోయిన సుధీర్‌ పరుగెత్తుకుంటూ అపార్ట్‌మెంట్‌ కిందకు వచ్చి... గేటు వద్ద బ్లేడుతో గొంతుకోసుకొని కింద పడిపోయాడు. ఇది గమనించిన అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుధీర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఇక... నవీన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం నవీన్‌పై దాడి, సుధీర్‌ ఆత్మహత్యాయత్నంపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని నారాయణగూడ పోలీసులు తెలిపారు. స్వయానా హోంమంత్రి అల్లుడికి సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.