పట్టిసీమను కేసీఆర్ అడ్డుకోవాలి: పాల్వాయి గోవర్థన్ డిమాండ్
తెలంగాణకు నీటి కేటాయింపులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ నిర్మిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మౌనంగా ఎందుకుంటున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు నష్టమని పాల్వాయి అన్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమతో పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతినే అవకాశముందన్నారు. గోదావరి జలాలు వినియోగించుకోవడంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల్లో వాటా తేలకుండా ప్రాజెక్టులను రూపొందిస్తే తెలంగాణ రాష్ట్రమే నష్టపోతుందని పాల్వాయి అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని పాల్వాయి ఎద్దేవా చేశారు.