గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (06:25 IST)

ఇది భళే బడ్జెట్... తెలంగాణ ఎంపీల కితాబు

కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర సమితీ ఎంపీలు ప్రశంస వర్షం కురిపించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి బడ్జెట్ రాలేదని, ఇది నూతన అధ్యాయానికి తెర తీసిందని వ్యాఖ్యానించారు. రైల్వే ఆధునీకరణకు ఇక్కడ నుంచే నాందిపలుకుతుందని అన్నారు. దీనిపై బండారు దత్తాత్రేయ, కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, సీతారామ్ నాయక్ సుమన్ తదితరులు వ్యాఖ్యానించారు. 
 
 ఢిల్లీలో గురువారం మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టానికి పలు ప్రాజెక్టులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్-మహబూబ్ నగర్ 110 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు అనుమతి లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్ప టినుంచి ఈ ప్రాజెక్టుకోసం కృషి జరగుతున్నదని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎంపీలమంతా రైల్వే ప్రాజెక్టుల కోసం విశేషంగా కృషి చేసినందువల్లనే పలు ప్రాజెక్టులకు అనుమతులు లభించాయని చెప్పారు. 
 
టీఆర్‌ఎస్ ఎంపీ కవిత మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురికాగా ఇప్పుడు స్వంత రాష్ట్రంలో ఒక్కొక్కటీ సాకారమవుతున్నాయన్నారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ మార్గం డిమాండ్ ఇరవై సంవత్సరాలుగా ఉందని, సుమారు రూ. 280 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు ఈ ఒక్క బడ్జెట్‌లోనే రూ. 141 కోట్ల నిధులు కేటాయించడం తెలంగాణకు ఆనందమన్నారు.  
 
ఈ బడ్జెట్‌లో తెలంగాణకు మంజూరైన ప్రాజెక్టుల జాబితా చూసిన తర్వాత ఎంపీల పాత్ర ఎంత ముఖ్యమో అర్థమవుతుందని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కావడం వల్ల ప్రయోజనమేమిటో ఇవాళ మంజూరైన ప్రాజెక్టులు చెబుతున్నాయని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు మెదక్-అక్కన్నపేట రైలు మార్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యమైందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. .