బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (11:43 IST)

తెరాసలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్.. ఆ ఒక్క 'గ్రేటర్' కార్పొరేటర్ కూడా..

తెలంగాణ టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను హర్షిస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాక కేసీఆర్ వైపు ప్రజాతీర్పు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.దాంతో మొదటిసారి ప్రజలు పూర్తిగా ఒకేవైపు నిలిచారని అర్థమవుతోందని వివేక్ చెప్పారు.
 
మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ పొంది విజయం సాధించిన ఒకే ఒక్క అభ్యర్థి, కేపీహెచ్‌బీ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు తెరాసలో చేరనున్నారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి ద్వారా సమాచారాన్ని సీఎంకు చేరవేసిన ఆయన, ఈ ఉదయం కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. శ్రీనివాసరావుకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంతో, ఇక ఆయన చేరిక లాంఛనమే కానుంది.