శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (14:41 IST)

మృతుల కుటుంబాలకు జగన్ ఓదార్పు... బోరున విలపించిన కిషన్ రెడ్డి!

మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనాస్థలిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురువారం పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఘటనా స్థలిలో తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బోరున విలపించారు. 
 
ఈ ప్రమాదంలో డ్రైవరు, క్లీనర్‌తో సహా 20 మంది విద్యార్థులు మరణించిన విషయం తెల్సిందే. ఘటనా స్థలిలోనే 13 మంది మృతిచెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు తుదిశ్వాస విడిచారు. మరో 15 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు విద్యార్థులు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. 
 
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని పలువురు నేతలు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేక విలపించారు. కాసేపటి తర్వాత మృతుల తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చారు. అనంతరం అక్కడే ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో మాట్లాడారు.