కేసీఆర్కు సీసాల మూతలు విప్పేందుకే టైం సరిపోవడం లేదు : రేవంత్ రెడ్డి ధ్వజం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై టీ టీడీపీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోమారు ధ్వజమెత్తారు. బుధవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్, కంగ్టి మండలాల్లో టీడీపీ అభ్యర్థి విజయపాల్రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... శాసనసభలో తన కళ్లల్లో కళ్లు పెట్టి సూటిగా చూడలేని సీఎం కేసీఆర్.. తనను ఎలా కొనుగోలు చేస్తాడని ప్రశ్నించారు.
'సంతలలో పశువులను కొనుగోలు చేసినట్లు.. తమ పార్టీ వారిని టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే పరిస్థితి త్వరలో టీఆర్ఎస్లోనూ నెలకొంటుందన్నారు. అధికారం ఎప్పటికీ ఒకరివద్దనే ఉండదనే విషయాన్ని గుర్తించి పోలీసులు వృత్తి ధర్మాన్ని పాటించాలన్నారు. అక్రమ కేసులు పెడితే సహించబోమన్నారు.
ఇకపోతే.. ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి టీడీపీకి రాజీనామా చేయడంపై రేవంత్ స్పందిస్తూ... పదవులు అనుభవించిన వారే పార్టీని వీడుతున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాలు, విద్యావంతులైన యువతతో కలిసి రాష్ట్రంలో టీడీపీని నిలబెడతానన్నారు. పదవులు అనుభవించిన వారంతా వదిలివెళ్లినా ముందుండి పార్టీని నిలబెడతానన్నారు.
కేసీఆర్ - ఎర్రబెల్లి రహస్యమిత్రులని, ఇప్పుడది బహిర్గతమైందన్నారు. టీడీపీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ కూడా యువతకు పెద్దపీటవేశారని, వారి మద్దతుతో అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. అప్పుడు కూడా పార్టీ ఒడిదొడుకులకు గురైందని, కానీ ఆయా సందర్భాలలో యువరక్తం నింపి పార్టీని నిలబెట్టారని పేర్కొన్నారు. పార్టీలో నేనొక్కడినే కాదు. నావెంట పది లక్షల మంది కార్యకర్తలున్నారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం టీడీపీలో పని చేస్తా అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.