బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2015 (14:54 IST)

సన్నబియ్యం పేరుతో రూ.కోట్ల అవినీతి : రేవంత్ రెడ్డి ధ్వజం

వసతిగృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నవన్నీ అసత్యాలని తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. వసతిగృహాల విద్యార్థులకు దారుణమైన బియ్యంతో అన్నం పెడుతున్నారని... సన్నబియ్యం ముసుగులో రూ.కోట్లలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. 
 
ఆయన ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... దొడ్డు బియ్యాన్ని పాలిష్‌ చేసి సన్నబియ్యంగా చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే పాఠశాలలు, వసతిగృహాల్లో బియ్యంపై విజిలెన్స్‌ దాడులు చేయించాలని డిమాండ్‌ చేశారు. 
 
వసతి గృహాల్లో బియ్యం నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాలన్నారు. సీఎం కుటుంబ సభ్యులెవరైనా వసతిగృహాల్లో భోజనం చేయగలరా? అని సవాల్‌ చేశారు. అవినీతిని సహించేది లేదని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.