శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (19:21 IST)

కేసీఆర్‌పై పాస్ పోర్టు కేసులున్నాయ్.. ఆలుగడ్డలు అమ్ముకునే వ్యక్తిని..?

ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలు నుంచి విడుదలైన అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లపై ఫైర్ అయ్యారు. చేతనైతే అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి మాట్లాడాలని తలసానికి రేవంత్ సవాల్ విసిరారు. 
 
టీఆర్ఎస్‌లో చేర్చుకున్న టీడీపీ నేతలందరూ ముందు అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసి విమర్శలు చేయండని రేవంత్ రెడ్డి సూచించారు. టీడీపీ పెట్టిన భిక్షతోనే పార్టీలు మారుతున్నవారు.. పదవులు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. పనిలో పనిగా కేసీఆర్‌పై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లంబుగానికి దిమాఖ్ కాళ్లలో ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. 
 
రాజకీయాల్లోకి రాకముందు మేనమామ ఇంట్లో రబ్బరు చెప్పులు వేసుకుని, చాయ్ కప్పులు ఎత్తేవానికి, మేనమామ గతచరిత్ర తెలియదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పాస్ పోర్టు కుంభకోణం కేసులు ఉన్నాయన్నారు. అప్పట్లో పోలీసులెక్కడ పట్టుకెళ్లిపోతారోనని ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ ఇంట్లో దాక్కున్నాడని ఆయన పేర్కొన్నారు.