శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 జులై 2015 (17:47 IST)

కేసీఆర్‌కు ఆ విషయం ముందే తెలియదా?: సబితమ్మ సూటి ప్రశ్న

చాలాకాలం తర్వాత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీన్లోకి వచ్చారు. వచ్చీ రావడం తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సాగు, తాగునీరు అందించడం కేసీఆర్‌కు ఇష్టం లేనట్టు ఉందని సబితా తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కావాలని డిమాండ్ చేసినప్పుడు కేసీఆర్‍‌కు ఈ ప్రాజెక్టు డిజైన్ సరికాదని తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. 
 
చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసునన్నారు. చేవెళ్లకు నీరందకుండా డిజైన్ మారిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వాన్ని సబిత హెచ్చరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును ప్రజలు అంగీకరించట్లేదని, ఒకవేళ ప్లాన్ మార్చాలనుకున్నా.. కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సబిత దుయ్యబట్టారు. పార్టీలకు మార్కులు ప్రధానం కాదని, ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలు పరిరక్షించాలని సబితమ్మ కేసీఆర్‌కు సూచించారు.