శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (15:50 IST)

ఆటో రికార్డింగ్ ఆప్షన్ వల్లే ఫోన్ సంభాషణల రికార్డు : ఫోన్ ట్యాపింగ్‌పై టీ ఏసీబీ

ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్, టీ టీడీపీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన సంభాషణలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించినవి కాదని తెలంగాణ ఏసీబీ స్పష్టం చేసింది. సెబాస్టియన్ వాడే హెచ్‌టీసీ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న ఆటో రికార్డింగ్ ఆప్షన్ వల్లే తమకు ఆడియో సంభాషణ వీడియో లభ్యమైందని తెలిపింది. దీంతో సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ మధ్య కాల్‌డేటా ఎలా బయటికి వచ్చిందన్న విషయం బట్టబయలు చేసింది. 
 
ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్న విషయంతెల్సిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కారును ఏపీ ప్రభుత్వం తప్పుబడుతూ వచ్చింది. ఇదే అంశంపై ఆధారాలు సేకరించే నిమిత్తం అన్ని టెలికామ్ సంస్థల ప్రతినిధులను ఏపీ సీఐడీ పోలీసులు విచారించారు కూడా. వీటన్నింటికి ఏసీబీ మంగళవారం తెరదించింది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని తేల్చిచెప్పింది. 
 
ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్, సండ్ర వెంకటవీరయ్యల మధ్య ఫోన్ సంభాషణలు జరిగిన సమయంలో సెబాస్టియన్ హెచ్‌టీసీ స్మార్ట్ ఫోన్ వాడారని, ఈ ఫోనులో ఉన్న ఆటో రికార్డింగ్ ఆప్షన్ వల్ల వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలన్ని రికార్డు అయినట్టు తెలిపింది. అయితే, సెబాస్టియన్ కావాలనే ఫోన్‌లో ఆటో రికార్డింగ్ పెట్టుకున్నారా? లేక ఆయనకు తెలియకుండానే ఆటో రికార్డింగ్ అనే ఆప్షన్ ఆ ఫోన్‌లో ఉన్నదా అనే విషయం తెలియాల్సిఉంది. ఈ ఫోన్‌ను సెబాస్టియన్ నుంచి టీ ఏసీబీ స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అసలు విషయం వెలుగుచూసింది. పైగా... మే 27 నుంచి 30 వరకు వీరిద్దరి మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణ జరిగింది. ఇదే సండ్ర అరెస్టుకు కీలక సాక్ష్యంగా మారిందని ఏసీబీ అధికారులు చెపుతున్నారు. అలాగే, రేవంత్ రెడ్డి, సండ్ర, సెబాస్టియన్, చంద్రబాబుల మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్టు కూడా తెలుస్తోంది.