బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 25 జులై 2014 (13:40 IST)

సడెన్ గా పట్టాలపైకి బస్సు... ఢీకొనగానే పెద్దగా ఏడ్చేశా... రైలు డ్రైవర్

సడెన్ గా పట్టాలపైకి స్కూలు బస్సు. కంట్రోల్ చేసేందుకు సడెన్ బ్రేక్ వేసేటప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. బస్సును రైలు ఢీకొంటూ ఈడ్చుకొస్తుంటే పెద్దగా ఏడ్చేశాను. రోదిస్తూనే రైలును ఆపేందుకు బ్రేకులు వేస్తూనే ఉన్నానంటూ రైలు డ్రైవరు సత్యనారాయణ ఆవేదనతో చెప్పారు.
 
ఉదయాన్నే ఈ ఘోర విషాదాన్ని చూడాల్సి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము నాందేడ్ నుంచి బయలుదేరిన దగ్గర్నుంచి నిబంధనల ప్రకారం రైలు హారన్ మోగిస్తూనే వచ్చామనీ, కానీ మాసాయిపేట వద్ద అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి బస్సు రావడం చూసి గుండె పట్టేసినంత పనైందన్నారు. 
 
కానీ ఏమీ చేయలేకపోయామనీ, కళ్ల ముందు పసిబిడ్డల ప్రాణాలు పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైలును ఆపిన తర్వాత కొంతమంది తమపై దాడి చేసేందుకు వచ్చారనీ, కానీ అక్కడే మరికొందరు వారించారన్నారు. తాము వెంటనే రైల్వే అధికారులకు సమాచారాన్ని చేరవేసినట్లు వెల్లడించారు.