గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2019 (18:18 IST)

మేడం...మేడం, నేను..నేను, దారుణం..హృదయవిదారకం..

అబ్ధుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తహశీల్ధార్ కార్యాలయంలోకి వెళ్ళి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అతి దారుణంగా చంపేశారు. మంటల్లో చిక్కుకున్న ఎమ్మార్వో బయటకు వచ్చి కేకలు వేశారు. అయితే ఆమెను కాపాడేందుకు డ్రైవర్ గురునాథం, అటెండర్లు ప్రయత్నించారు. 
 
కానీ అప్పటికే విజయారెడ్డి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే మొదట్లో తహశీల్ధార్ కార్యాలయం నుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. డ్రైవర్ గురునాథం, అటెండర్లు ఇద్దరూ కార్యాలయం బయటే కూర్చుని ఉన్నారు. ఎవరో గట్టిగా అరుస్తున్నారని అడెండర్ లైట్ తీసుకున్నాడు. కానీ డ్రైవర్ గురునాథం మాత్రం వేగంగా ఎమ్మార్వో కార్యాలయంలోకి పరుగెత్తికెళ్ళాడు.
 
చుట్టూ పొగ.. మధ్యలో మంటలు.. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మేడం..మేడం అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఎవరూ పలుకరించలేదు. కొద్దిసేపటికి మంటలు తనవైపుగా వస్తుండటాన్ని గమనించాడు. మళ్ళీ మేడం... ఎమ్మార్వో మేడం..మేడం అన్నాడు. కాలుతున్న వ్యక్తి చేతులు పైకెత్తింది.. నేను అంటూ సైగ చేయబోయింది. దీంతో డ్రైవర్ గురునాథం అప్రమత్తమయ్యాడు. ఆమెను మంటల్లో నుంచి బయటకు తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు.
 
చేత్తోనే మంటలను ఆపాడు. అయితే పెట్రోల్ ఎక్కువగా ఉండటంతో గురునాథం కూడా అంటుకుపోయాడు. అతని శరీరం కూడా 80శాతంకు పైగా కాలిపోయింది. హుటాహుటిన అపోలో ఆసుపత్రికి అతడిని తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం గురునాథం మరణించాడు. మూడు సంవత్సరాల క్రితమే గురునాథంకు వివాహమైంది. ఒక పాప ఉంది. ప్రస్తుతం గురునాథం భార్య గర్భిణి. గురునాథం చనిపోయాడన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.