గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (11:42 IST)

నా జోలికొస్తే చంద్రబాబును చీరేస్తా : తలసాని శ్రీనివాస్ వార్నింగ్

తెలుగుదేశం పార్టీలో తనకు అన్యాయం జరగడం వల్లే తాను ఆ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినట్టు హైదరాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు పునరుద్ఘాటించారు. అయితే, పార్టీ మారడం వల్ల తనపై టీడీపీ నేతలు లేదా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలితో మాత్రం వారి బండారం బయటపెడతానని ఆయన హెచ్చరించారు. 
 
బుధవారం సాయంత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్‌, తీగల కృష్ణారెడ్డి, మరో ఎమ్మెల్సీ తెరాసలో చేరిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా అమీర్ పేటలో జరిగిన బహిరంగ సభలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రసంగిస్తూ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారని తెలిసి... వారిని పర్సనల్‌గా పిలిపించుకుని, మీకేం కావాలి? మీ పిల్లలకేం కావాలి? అంటూ అనేక రకాలుగా చంద్రబాబు తమను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు. 
 
తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. చంద్రబాబును ఉద్దేశించి ‘బిడ్డా! మరో జన్మ ఎత్తినా తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం రాదు. హైదరాబాద్‌ మాది. మా తడాఖా చూపిస్తాం’ అంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టువదలని విక్రమార్కుడిలా పాటుపడుతున్నారని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే తాను టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.