మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (12:54 IST)

ఈ ఫలితంతో బుద్ధి తెచ్చుకోండి.. లేదంటే నాలుక చీల్చేస్తాం : మంత్రి తలసాని

వరంగల్ ఉప ఎన్నిక ఫలితంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు బుద్ధి తెచ్చుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్‌లో నాలుకలు చీల్చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరిచారు. ఈ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి పసుమర్తి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని తేలడంతో తలసాని స్పందించారు. 
 
డిపాజిట్లు రాని నేతలు కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతున్నామని తెలిసి కూడా విపక్షాలకు చెందిన కొంతమంది నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 
 
బాధ్యత లేకుండా నోరు పారేసుకునే నేతల నాలుకలు చీల్చేస్తామన్న రీతిలో ప్రజలిచ్చిన ఈ తీర్పు విపక్ష నేతలకు గుణపాఠమేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకుని పరిధి దాటకుండా వ్యవహరిస్తే మంచిదని కూడా ఆయన హెచ్చరించారు. 
 
ఇదిలావుండగా, వరంగల్ ఉప ఎన్నికల్లో దాదాపుగా విజయం ఖరారవడంతో టీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మొత్తం ఓట్లలో దాదాపుగా 4 లక్షల ఓట్ల దాకా చేజిక్కించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం ఖరారైపోయింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. వరంగల్‌లోనే కాక హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయం తెరాస భవన్ వద్ద కూడా సంబరాలు జోరందుకున్నాయి.