శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (12:56 IST)

టీఆర్ఎస్‌లో చేరనున్న తీగల కృష్ణారెడ్డి - జి సాయన్న!?

తెలంగాణ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారిలో తీగల కృష్ణారెడ్డి, జి సాయన్న ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఖమ్మం జిల్లా టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు కారెక్కిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. 
 
తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ దిగి... కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కూడా టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా తలసాని సోమవారం ఉదయం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆయన దసరా రోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. 
 
ఇక తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీ మారే విషయంలో తన అనుచరులతో పాటు, నియోజకవర్గ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆయన అనుచరులు కూడా తీగల టీఆర్ఎస్లో చేరేందకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. తెలంగాణలోని టీడీపీ నేతలను.. పార్టీలోకి చేర్చుకునేందుకు తెరవెనుక రాజకీయాలు చేస్తోంది.