శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (15:01 IST)

సీఎం కేసీఆర్‌నే అంతు చూస్తానన్నారు.. సాక్ష్యాలు తారుమారు చేస్తారు : టీ ఏఏజీ

ఓటుకు నోటు కేసులో బెయిలుపై విడుదలైన ప్రధాననిందితుడు రేవంత్ రెడ్డి ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే అంతుచూస్తానని బెదిరించారని, అందువల్ల ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఈ కారణంగా రేవంత్ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. 
 
రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) గురువారం ఉదయం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. బెయిల్‌పై విడుదలైన రేవంత్ రెడ్డి సాక్షాత్తు సీఎం కేసీఆర్‌నే అంతుచూస్తానని బెదిరిస్తున్నారని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ రాగానే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే, కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేయడని గ్యారెంటీ ఏమిటని ఏఏజీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. 
 
కాగా, బుధవారం చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యాక కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌పైనే కాకుండా, తెలంగాణ మంత్రులపైనా పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. సదరు వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో, వీడియో టేపులను కూడా ఈ బెయిల్ పిటీషన్‌కు జతచేసి, బెయిల్‌ను రద్దు చేయాలని కోరడంతో మళ్లీ ఉత్కంఠత నెలకొంది.