తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ : మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ళ తర్వాత వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఆ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 20 లక్షల పంపుసెట్లు ఉండగా... ఆంధ్రప్రదేశ్ లో 12 లక్షల పంపుసెట్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు.
అయినా, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ సీమాంధ్రలో ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీమాంధ్రుల పాలనలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు. తెలంగాణలో విద్యుత్ ఉంటేనే పంటలు పండుతాయని... లేకపోతే రైతన్నలు ఆకలితో అలమటించాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు ప్రారంభించారని చెప్పారు. మరో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం పనులను ప్రారంభించిందని తెలిపారు. రానున్న మూడేళ్లలో రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ అందిస్తామని... ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అన్నారు.