శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (09:02 IST)

త్యాగాలకు సిద్ధంకండి.. తెలంగాణ మంత్రులకు సీఎం కేసీఆర్ సంకేతాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో పలువురికి ఉద్వాసన పలికి.. కొత్త వారికి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో త్యాగాలకు సిద్ధంకావాలంటూ కేసీఆర్ సంకేతాలు పంపించారు. నవ తెలంగాణ అభ్యున్నతి కోసం రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్న క్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ బలంగా భావిస్తున్నారు. అందుకే మార్పులుచేర్పులు తప్పవని ఆయన సంకేతాలు పంపించినట్టు పార్టీ శ్రేణులు చెపుతున్నాయి. 
 
తద్వారా సీఎం కేసీఆర్‌ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలపై పరోక్ష సంకేతాలు ఇచ్చారనే చర్చ టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెపుతున్నారు. ప్రధానంగా పార్టీ తరపున శాసన మండలికి ఎన్నికైనవారు పదవీత్యాగం చేసే విషయంలో ముందువరుసలో ఉండే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత స్థానంలో ఎమ్మెల్యేలు ఉంటారని వారు చెబుతున్నారు. ఇప్పుడున్న మంత్రివర్గంలో ఒక్కటంటే ఒక్క ఖాళీ కూడా లేదు. అందువల్ల ఇప్పుడు పదవుల్లో ఉన్న వారిని తొలగించి, వారి స్థానాల్లో కొత్తగా మరికొందరిని తన కేబినెట్‌లో చేర్చుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. 
 
అయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల దామాషా ప్రకారం ఆ రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య సీఎంతో కలుపుకుని 18కి మించకూడదు. ఈ లెక్కన చూస్తే కేసీఆర్ మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఉంది. దీంతో ప్రస్తుత మంత్రుల పనితీరును బేరీజు వేసి, ఆశాజనకకంగా లేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి చోటు కల్పించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.
 
కొత్తగా మంత్రిపదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య మాత్రం భారీగావుంది. వీరిలో సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నుంచి తెరాస తీర్థం పుచ్చుకుంటున్న వారుకూడా ఉన్నారు. ఇలాంటి వారిలో కె.స్వామిగౌడ్‌, వి.శ్రీనివాస్ గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, రసమయి బాలకిషన్‌, తాజాగా కాంగ్రెస్‌ పార్టీని వీడి త్వరలో తెరాసలో చేరనున్న సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు ఉన్నారు. వీరిలో కొందరికి మంత్రిపదవులు ఇవ్వాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. మొత్తంమీద తెలంగాణ మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకోన్నాయి.