టీ ఇంటర్ విద్యార్థుల భవిత ప్రశ్నార్థకం .. జేఈఈ పరీక్షలకు అనర్హులా!?
తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్యపు వైఖరి కారణంగా ఇంటర్ విద్యార్థులు, ఐఐటి జేఈఈ వంటి కీలక పరీక్షలకు గైర్హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు అత్యంత కీలకమైన సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) వద్ద ఉన్న జాబితాలో మాత్రం ‘తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు' లేదు. ఆ జాబితాలో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమే ఉంది. దీంతో అత్యంత కీలకమైన జేఈఈ-మెయిన్స్ పరీక్షలు రాయనున్న తెలంగాణ విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఈ మేరకు గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇప్పటికే సమర్పించిన దరఖాస్తును ‘సవరించడం' ఎలాగో తెలియని తికమక పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని సీబీఎస్ఈని సంప్రదించి తగిన చర్యలు తీసుకోకపోతే జేఈఈ-మెయిన్స్లో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదముంది. జేఈఈ మెయిన్స్ పరీక్షకు డిసెంబర్ 18వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. దరఖాస్తు చేసుకునే సమయంలో తాము ఏ ఇంటర్మీడియ్ బోర్డు నిర్వహించే పరీక్షలు రాస్తున్నదీ విద్యార్థులు దరఖాస్తు ఫామ్లో (ఆన్లైన్) పేర్కొనాల్సి వుండగా, వారు తికమకపడ్డారు.