శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (12:47 IST)

తెలంగాణ 'స్థానిక ఎమ్మెల్సీ' కోటా సమరంలో తెరాస - కాంగ్రెస్ 'దోస్తీ'..?

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఏకం కాబోతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు టీ కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలతో గులాబీ బాస్ టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ వార్తలు గుప్పుమనడంతో కాంగ్రెస్ నేతల్లో కలకలం చెలరేగింది. అంతర్గతంగా కలహం మొదలైంది. ఎక్కడైనా.. అధికార, విపక్ష పార్టీలు చేతులు కలిపాయా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. 
 
అయితే, వీటితో ఏమాత్రం సంబంధం లేకుండా తెరాస - కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా సీట్ల పంపిణీపై కూడా ప్రాథమికంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ చర్చల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మూడు ఎమ్మెల్సీ టిక్కెట్లను కోరగా, తెరాస రెండుతో సరిపుచ్చాలని భావిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం అంతర్గత కలహాలు చెలరేగాయి. ఇలాంటి ప్రతిపాదనలకు ఆస్కారమే లేదని తేల్చి చెపుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మనం అధికారపక్షంతో అవగాహనం కుదుర్చుకోవడం ఎక్కడైనా ఉందా? పోరాడాల్సిన మనమే ఇలా చేస్తే అర్థమేముంటంది. దీనికి బదులు ఎన్నికల్లో అధికార పార్టీకే ఓటు వేయమని చెబితే సరిపోతుంది కదా అని పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.